నిద్ర నన్ను ఒంటరిని చేసి ప్రపంచాన్ని చీకటిలో చూడమని
ఆదేశించింది... శాంతిని వెదుక్కుంటూ నిశీధిలో నడచి నడచి నిజాలు ఎన్నో
తెలుసుకున్నా....
పగలు చూసే ప్రపంచం అంతా ప్రకృతి సహజం కాదని ,రాత్రి జరిగే రాజకీయాలు , రాజీ లేని పోరాటాలు ఉదయాన్ని శాసిస్తాయని .....
ఆశలు తీర్చుకోవడానికి కొందరు మనుషులు ఎదుటివారి ఆశయాలను కూడా ఖాతరు చెయ్యరని .....
అధికారం
చేజిక్కించుకోవడం కోసం , ఎందరో అభిమానించే మహానుభావులను , వారి
సిద్ధాంతాలను పాటించే వారి మనోబావాలను కించపరిచే చర్యలకు పాల్పడతారని ,
ప్రతి సంధర్బంలో స్పందించే సమసమాజస్థాపక సంఘాలు , ఈ సమయం లో మహోన్నతులను కొన్ని వర్గాలకు పరిమితం చేస్తాయని ......
సరే
ఈ సంఘాల స్వభావం ఇంతే అని అనుకునేలోపు , ఎవరి వల్లనైతే తమ జీవితాలు ఒక
స్థాయికి వచ్చాయో , ఆ వ్యక్తులకు జరగకూడనివి జరిగితే ఖండించలేని మేధావి
వర్గాలు కూడా ఉంటాయని...
కన్నీళ్ళు తాగుతూ , జాతి సంపదను పెంచడానికి శ్రామిక వర్గాలు తమ జీవితాంతం అలుపెరుగక కృషి చేస్తాయని ,
ఏ
మూలో ఒక అరుగుపై , కాళ్ళు ముడుచుకొని , కటిక చీకటిలో , కురిసే మంచులో ,
చలికి గజగజ వణుకుతున్న ఆ పసివాడు చేసిన పాపం ఏమిటనే ప్రశ్నలు సమాధానం
సాధ్యం కానివేమి కావు అని,
నేను పేదవానిగా ఎందుకు పుట్టాననే ప్రశ్న ,
నేను ఒంటరిని ఎందుకు అయ్యాననే ఆలోచన వారికి వచ్చినప్పుడు సమాజంలో వచ్చే
విప్లవాన్ని ఏ ధనిక ,పెట్టుబడిదారి వర్గాలు ఆపలేవని ......
సమసమాజ స్థాపన కోసం మేధావులు , రాజ్యాంగ నిర్మాతలు అందించిన అవకాశాలను , అజ్ఞానంతో అర్ధం చేసుకోలేని విజ్ఞానవంతులు ఉంటారని ......
ఎవరో ఒకరు అవకాశాలు కోల్పోతున్నారని , కొన్ని కోట్ల కుటుంబాల గురించి ఆలోచన చేయలేని అవకాశవాదులు అర్ధరహిత వాదనలు చేస్తారని .......
జాతి అభివృద్ధి కోరుకునే వారు , అందులో భాగమైన బడుగుల భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడం వెనక దాగిన రహస్యాలు వుహాతీతమేమి కావనీ....
మనిషి మనుగడకు కారణమైన అనేక వనరులు ప్రస్తుతం కొద్దిమంది అధీనం లో వున్నాయని .......
నిత్యం సత్యం మాట్లాడే వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారని
మంచిని వెదుకుతూ, వంచనకు గురయ్యి , బలయ్యి మోడుబారిన జీవితాలు ఎన్నో లేక్కేలేదని ....
కత్తిని
చూసి మెత్తగా మాట్లాడేవారు , ఆయుధం లేకుండా అడుగు బయట పెట్టలేని వారు ,
పదవి కోసం శవాలపై ప్రమాణాలు చేసేవారు, పదిమందిని ముంచినా సరే మనం మంచిగా
వుండాలి అనుకునేవారు చీకటిలో చాలా ఒప్పందాలు చేసుకుంటారని .....
మనుషులను మతాలుగా.. మతాలను శత్రువులుగా ..
కులాన్ని కుట్రలకు అనుకూలంగా .... కుట్రలన్నీ కురుక్షేత్రం అయ్యేలాగా ......
ఆత్మీయుల
మధ్య అంతరాలు పెంచే అభివృద్ధి జపమాంత్రికులు , అనుక్షణం కుతంత్రాల
భవంతిలో స్థానం కోసం బహిరంగంగానే దూషించుకుంటారని..... సమాజం నన్ను
హెచ్చరించింది....... సంఘంలోని అసమానతలని అర్ధం చేసుకొని,
నిర్మూలించడానికి ప్రయత్నించమంది......
-Kurella Swamy